సీనియర్ కార్పొరేటర్, వైసీపీ నేత పిండి సురేష్, 36వ డివిజన్ కార్పొరేటర్ ఆయన సతీమణి పిండి శాంతిశ్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో… తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్పేట సెంటర్ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ఆయన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా జై శ్రీధరన్న…జై గిరిన్న…జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పిండి సురేష్ దంపతుల్ని కోటంరెడ్డి సోదరులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టీడీపీ కండువాలు కప్పి అభినందించారు. ముందుగా కోటంరెడ్డి సోదరుల్ని పిండి సురేష్ గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…పిండి సురేష్ది నాది రాజకీయ బంధం కాదన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి మాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఈ రోజు వారు తమ పార్టీలోకి చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. పిండి సురేష్ మాట్లాడుతూ… నా రాజకీయ జీవితం శ్రీధర్రెడ్డికే అంకితమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, పిండి సురేష్ అభిమానులు పాల్గొన్నారు.