- సర్వే నెం. 78/1 లో 6.08 ఎకరాల భూమి ఆక్రమణ…?
- పట్టించుకోని అధికారులు
- ఆలయ భూమిని కాపాడాలంటున్న పామూరు వేణుగోపాలస్వామి ఆలయ ఈవో
ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూములు… నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వేంపాడు రెవెన్యూలో ఉన్నాయి. అయితే ఆ భూములపై కొందరు వ్యక్తులు కన్నేశారు. ఏకంగా సర్వే నెం. 78/1 లోని 6.08 ఎకరాల భూములకే ఎసర పెట్టారు. ఆలయ కమిటీతో సంబంధం లేకుండా అర్చకులు తమకు అమ్మినట్లుగా బినామీ రికార్డులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం జేసీ కోర్టులో సాగిన విచారణలో ఆ భూమిలో పట్టాలు పొందిన వ్యక్తుల పేర్లను తొలగించి యధావిధిగా ఆలయ భూమిగా నమోదు చేయాలని తీర్పు ఇచ్చారు. దీంతో ఆలయ ఈవోతోపాటు కమిటీ సభ్యులు తమకు న్యాయం జరిగిందని…ఆ భూమిని స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా మండల రెవెన్యూ అధికారులు మాత్రం ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనునమానాలకు తావిచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆక్రమణదారులు జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి భూములను చదును చేయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దేవుని మాన్యాన్ని కాపాడి…ఆలయ ఆస్తిగా రికార్డులో నమోదు చేయాలని…పామూరులోని శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ ఈవో గిరిరాజ నరసింహరావు కోరారు.