-అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం అభినందనీయం
-ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-ఇంత మంచి కార్యక్రమాన్ని వైసీపీ ఎందుకు మూసేసిందో
- నెల్లూరు సిటీ పరిధిలోని కొత్తహాలు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ఎంపీ
పేదల కడుపు నింపడమనే.. ఎన్టీఆర్ ఆశయాల నుంచి అన్నా క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయని.. 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చారని.. ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు ఆచరణలో పెడుతూ.. పేదలకు వరంలా మారారని.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కొనియాడారు. అలాగే.. నిరుపేదల కడుపు నింపేలా చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో అర్థంకావడంలేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన నెల్లూరు కొత్తహాలు సమీపంలో అన్నా క్యాంటీన్ను జేసీ కార్తీక్తో కలసి పునఃప్రారంభించారు.
ముందుగా అక్కడ ఎంపీకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పుష్ఫగుచ్ఛాతో ఆహ్వానం పలికి సత్కరించారు. అనంతరం ఆ క్యాంటీన్ లో వసతులను పరిశీలించారు. ఆయనే స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం పేదలతో కలసి ఆయనా అల్పాహారాన్ని భుజించారు. అనంతరం వీపీఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కొత్త హాలు ప్రాంతంలో అధికంగా హాస్పిటల్స్ ఉన్నాయని, వాటికి వచ్చే వేలాదిమందికి అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నిండుతుందన్నారు. ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఫుడ్ బయట హోటళ్లలో దాదాపు 150 నుంచి 250 రూపాయలువరకు పడుతుందన్నారు.
ఇలాంటి భోజనాన్ని కేవలం 5 రూపాయలకే అందించడం పేదవారికి గొప్ప అవకాశం అన్నారు. ఇంత శుచి, శుభ్రత గల ఆహారాన్ని సరఫరా చేస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా విలువైనవని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్ల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి కోరారు.