- సోమశిల జలాశయంలో జోరుగా చేపల వేట
- జలాశయంలో ఎస్ఐ సుబ్బారావు తన సిబ్బందితో దాడి
- పోలీసుల అదుపులో ఓ వ్యక్తి..చేపలు స్వాధీనం
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేప గుడ్డు దశలో ఉండడంతో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు చేపలు పట్టకూడదని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే కొంతమంది నిషేధాజ్ఞలు అతిక్రమించి చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినవొస్తున్నాయి. చేపల వేట సాగించి తరలింపుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రావడంతో సోమశిల ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. జలాశయం ముఖ ద్వారం వద్ద చేపలతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్స్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి ఓ బడా వ్యాపారస్తుడికి చెందిన వ్యక్తిగా స్థానికులు చర్చించుకుంటున్నారు. చేపలు గుడ్డు దశలో ఉండడంతో చేపలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ జీవన ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు లబోదిబో మంటున్నారు. ఫిషరీస్ అధికారులు కూడా దృష్టి సారించి అక్రమ చేపల వేటపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల ఆదివారం కిలో చేప సోమశిలలో 200 రూపాయిలకు పైగా పలువురు వ్యాపారస్తులు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటువంటి వారిపై వెంటనే మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చేపల ప్రియులు కోరుతున్నారు.