-48వ డివిజన్లో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి ఆనం, కలెక్టర్
ప్రతి పేదవానికి కూడు , గుడ్డ , నీడ అందించాలనే స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునః ప్రతిష్ట చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిoచామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరం 48 వ డివిజన్లో పాత మున్సిపల్ కార్యాలయ సెంటర్ వద్ద అన్న క్యాంటిన్ ను జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తో కలసి ఆనం ప్రారంభించారు. అక్కడే మంత్రి , జిల్లా కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పేదవానికి మూడు పూటలా పట్టెడన్నం తో కడుపు నింపాలనే ఆలోచనతో అన్న క్యాంటిన్లను పునః ప్రారంభించామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటైన అన్న క్యాంటీన్ లను జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. పేదలకు ఐదు రూపాయలకే అల్పాహారం , రుచికరమైన భోజనం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లలోని ఆహారం శుచి శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వంటశాలల్లో తయారుచేయించే ఏర్పాట్లు చేశామన్నారు. రుచికి, శుచికి ప్రాధాన్యతనిస్తూ మంచి పౌష్టికాహారాన్ని పేదలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రయ్య, అశేష ప్రజలు పాల్గొన్నారు.