- కావలిలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేతులమీదుగా జెండా ఆవిష్కరణ
కావలి పట్టణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరంగా జరిగాయి. ఎటుచూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడుంది. విద్యార్థుల జాతీయ గేయాలాపనలతో, నృత్యాలతో, జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం, ఏరియా వైద్యశాల, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముందుగా ఆర్డీవో శీనా నాయక్ ప్రగతి నివేదన చదివి వినిపించారు.
ఉత్తమ ఉద్యోగులకు ఎమ్మెల్యే చేతులమీదగా ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… కావలి అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. గెలిచిన రెండు నెలల్లోనే కావలి పట్టణంలో 73 లక్షల రూపాయల నిధులతో పారిశుద్ధ్య పనులు చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో 10 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవటం జరుగుతుందన్నారు. ఐక్యంగా కావలిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు, ఉద్యోగులు తనకు సహకరించాలని కోరారు.